మనకు ద్రోహము చేసి
మనను దాసుల జేసి
ఆటలాడెడి
అథమనేతలను గుర్తించి
కాలోజీ మాటల్లో
‘కాలంబురాగానే కాటేసి తీరాలె’.
ఇప్పుడు అటువంటి అవకాశం ఒకటి తెలంగాణ ప్రజలకు వచ్చింది. ఇప్పుడే కాదు ఇంకెప్పుడు ఇటువంటి అవకాశం వచ్చినా తెలంగాణ ద్రోహులెవరో, తెలంగాణవాదులెవరో గుర్తించి, గురిచూసి కొట్టవలసిన సమయం వచ్చింది. ఆ అవకాశం ఈ ఉప ఎన్నికలే. గత రెండేళ్లుగా ఉద్యమ వేదిక కానిచోటు లేదు. తెలంగాణ ఆకాంక్షను వ్యక్తీకరించని సందర్భం లేదు.
తెలంగాణ వచ్చినట్టే వచ్చి ఎందుకు ఆగిపోయిందో, ఆశ నిరాశల చక్రభ్రమణంలో తెలంగాణ హృదయాలు ఎంతగా కొట్టుమిట్టాడుతున్నాయో అందరికీ అనుభవమే! ఏ విద్రోహం, ఏ కుట్రలు, ఏ శక్తులు తెలంగాణ ప్రజలతో ఆటలాడుకుంటున్నాయో ఇప్పుడు స్పష్టంగానే తెలిసిపోయింది.
ఈ రెండేళ్ల క్షోభను, దుఃఖాన్ని ఎలా మరచిపోగలం? శ్రీకాంతాచారి మంటల్లో కాలిపోతూ చేతులు పైకెత్తి జైతెలంగాణ నినాదాలివ్వడం మనం ఇంకా మరచిపోలేదు. ఇషాంత్రెడ్డి అగ్నికి ఆహుతి అవుతూ రాసిన లేఖలో ఏం చెప్పారో ఇప్పటికీ జ్ఞాపకం ఉంది? కానిస్టేబుల్ కిష్టయ్య తుపాకిని తన కణతకు గురిపెట్టుకుని ఏమని తలుచుకుని ఉంటాడో మననం చేసుకుందామా! విద్యార్థులు, పోలీసుల కవాతు మధ్య అగ్నికీలల్లో యాదయ్య చేసిన తెలంగాణ ఊరేగింపు ఇప్పటికీ గుండెలను పిండుతూనే ఉంది. ఢిల్లీలో పార్లమెంటుకు కూతవేటు దూరంలో చెట్టుకు వేలాడిన యాదిరెడ్డి శవం ఏమని ప్రశ్నించిందో ఎలా మరచిపోగలం? వందలాది మృతవీరుల కుటుంబాల ఆర్తరావాలు ఇంకా మన చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. అయినా తెలంగాణ రాలేదు. స్వేచ్ఛామేఘాలకోసం నిరంతర నిరీక్షణ కొనసాగుతూనే ఉంది. ఇవ్వని కాంగ్రెస్, ఇవ్వనీయని తెలుగుదేశం….అంతా క్షేమంగానే ఉన్నారు. ద్రోహులు నిశ్చింతగా ఊరేగుతూనే ఉన్నారు.
దీక్షలు చేశాం. సభలు నిర్వహించాం. మహామహాసభలూ జరిపాం. బాష్పవాయుగోళాలను, లాఠీలనూ, తూటాలనూ ఎదుర్కొన్నాం. నిప్పుల్లో కాలిపోయాం. ఉరితాళ్లను అలుముకున్నాం….దేశచరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా 42 రోజులపాటు సమ్మె చేశాం. ఎన్ని నిరసన రూపాలో! ఎన్ని ఉద్యమ కార్యాచరణలో! ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సింగరేణి కార్మికులు, ఆర్టీసీ సిబ్బంది, న్యాయవాదులు, డాక్టర్లు, అన్నికులాలు, అన్ని వర్గాల ప్రజలు సమ్మెకట్టారు. ప్రజాస్వామ్య పంథాలో ఇంకేం ఉద్యమరూపాలు మిగిలాయి? మనముందు ఇంకేం ప్రత్యామ్నాయం మిగిలింది? హింసకు దిగలేం. విధ్వంసం సృష్టించలేం. ఆయుధాలు పట్టలేం. మారణహోమాలు మనం కోరుకోవడం లేదు. ఇక మిగిలింది ఒకే ఒక ఆయుధం-అది ఓటు. తెలంగాణలో ఇప్పటివరకు జరిగిన ప్రయోగాలు చాలు. సీమాంధ్ర నేతల పెత్తనంలోని పార్టీలతో తెలంగాణకు శాశ్వతంగా ఒక సమస్య ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి ఆంధ్ర ప్రాంతంతో ఆబ్లిగేషన్ ఉంటుంది. తెలంగాణ సాధన ఆ పార్టీకి ప్రాధాన్యం కాదు. పైగా ఇక్కడివాళ్లు ఇవ్వాలంటారు. అక్కడివాళ్లు వద్దంటారు. ఇది తేలే విషయం కాదు. కాంగ్రెస్దీ అదే పరిస్థితి. వైఎస్సార్ కాంగ్రెస్కు తెలంగాణపై పెద్దగా ఆశలు లేవు, తెలంగాణతో ఆబ్లిగేషనూ లేదు. ఈ పార్టీలతో ఇక తెలంగాణకు వచ్చేది, ఒరిగేది ఏమీ లేదు. ఈ పార్టీలతో తెలంగాణకు ఎప్పుడయినా సమస్యే. ఇటువంటి పార్టీలకు చరమగీతం పాడకుండా, తెలంగాణ సొంత రాజకీయ అస్తిత్వానికి పట్టం కట్టకుండా ఎన్నేళ్లు, ఎన్నాళ్లు తన్లాడినా ఈ గోస మారదు. ఈ సమస్య పరిష్కారం కాదు. కనీసం వంద మంది ఎమ్మెల్యేలు, 15 మంది ఎంపీలు ఒకే మాటగా, ఒకే బాటగా ముందుకు సాగే పరిస్థితి ఉంటే ఈ తెలంగాణ ఎలా ఉంటుందో ఊహించండి. తొమ్మిది మంది ఎంపీలతో శరద్పవార్ కేంద్రంలో ఎలా చలాయిస్తున్నారో చూడండి. యూపీఏ-1లో తృణమూల్ కాంగ్రెస్, డిఎంకెలు ఢిల్లీలో చక్రం తిప్పింది కేవలం డజను మంది ఎంపీలతోనే కాదా! అందుకే ఇక నుంచి జరిగే ప్రతి ఎన్నికా తెలంగాణపై తీర్పే కావాలి. తెలంగాణ చైతన్య జ్వాలను మరింత ఉన్నతంగా ఎగరేసే సందర్భం కావాలి.
తెలంగాణ సమస్య చల్లారిపోయిందని, తెలంగాణ ఉద్యమం తెల్లారిపోయిందని, తెలంగాణలో అంతా సవ్యంగా సాగిపోతున్నదని, సెంటిమెంటు లేదని నమ్మించాలని, రుజువు చేయాలని, ఢిల్లీవారికి చాటి చెప్పాలని ఇటు చంద్రబాబునాయుడు, అటు కాంగ్రెస్ పెద్దలు పోటీ పడుతున్నారు. ఒకప్పుడు తెలంగాణ పదాన్ని నిషేధించిన చంద్రబాబు, ఇప్పుడు తెలంగాణ నినాదం అసెంబ్లీలో, బయటా చర్చకు రాకుండా, రాజకీయ ఎజెండాలోకి లేకుండా చేయడానికి ఆడని నాటకం లేదు, వేయని వేషం లేదు. తెలంగాణకు అడ్డం పడే విషయంలో, తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీసే విషయంలో, తెలంగాణ ఉద్యమ శ్రేణుల్లో గందరగోళం సృష్టించే విషయంలో, తెలంగాణ నేతలకు తాయిలాలు వేసి, ఇక్కడి నేతల మధ్య చిచ్చు పెట్టే విషయంలో రెండు పార్టీల నేతలకూ పెద్దగా తేడాలేదు.
వీరి రాజకీయ అస్తిత్వం దెబ్బతింటే తప్ప, రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమైతే తప్ప తెలంగాణకు విముక్తి లేదు. తెలంగాణకు సంబంధించినంతవరకు వీరికి ఇక ఏమాత్రం రిలవెన్స్ లేదని, సీమాంధ్ర నాయకత్వం కింద పనిచేసే తెలంగాణ నేతలకు ఇక్కడ రాజకీయ భవిష్యత్తు ఉండబోదని దిగ్ధిగంతాలు మారుమోగేలా చాటిచెప్పాల్సిన తరుణం ఆసన్నమయింది. అందుకు మన చేతిలో ఉన్న ఏకైక ఆయుధం ఓటు. మాటతో చెబితే రానిది ఓటుతో చెబితే వస్తుంది. మంచిగా చెబితే విననివాడు ఓటుతో కొడితే వింటాడు. రాళ్లతో కొట్టాల్సిన పనిలేదు. చెప్పులు, కోడిగుడ్లు విసరాల్సిన పనిలేదు. ద్రోహుల గుండాలతో, వారి రక్షక భటులతో తలపడాల్సిన పనిలేదు. సభలు భగ్నం చేయాల్సిన అగత్యమూ లేదు. ఓటును వినియోగించుకోండి. తెలంగాణకోసం ఎత్తిన జెండా దించకుండా పోరాడుతున్నవారిని, తెలంగాణ నినాదాన్ని జాతివ్యాప్తం చేసినవారిని, తెలంగాణ సాధన ఏకైక లక్ష్యంగా అలుపూసొలుపూ లేకుండా ముందుకు సాగుతున్నవారిని విజేతలుగా నిలపండి. తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరో ఇవ్వడం ఏమిటి? మనమే సాధించుకుందాం. యాచించే దుస్థితి ఇంకా వద్దు. శాసించే పరిస్థితిని మనమే తెచ్చుకోవాలి. అందుకు మన చేతిలో ఉన్న అధికారం ఓటు. ఆ ఓటుతోనే సీమాంధ్ర ఆధిపత్య పార్టీలను విసిరికొట్టాలి.
రెండేళ్లుగా తెలంగాణ అనుభవిస్తు క్షోభలకు, గుండెకోతలకు, ఆత్మబలిదానాలకు, దుఃఖానికి ఒక ఊరటకావాలి. ద్రోహులకు శిక్ష విధించి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయడమే ఆ ఊరట. అన్ని విద్రోహాలకు, మోసాలకు, అన్నిరకాల వంచనలకు ఒకే ఒక దెబ్బ, అది ఓటు ఆయుధంతో జరిగిపోవాలి. మాట తప్పినవాళ్లను, మాట మార్చినవాళ్లను, మడమ తిప్పినవాళ్లను మన సమాజం ఎలా వెలివేస్తుంది? ముల్లును ముల్లుతోనే తీయాలి. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. మన ఓటుతో గెలిచి, మన మనోభావాలతో ఆటలాడుకుంటున్న కాంగ్రెస్, టీడీపీలకు ఓటు ఆయుధంతోనే గుణపాఠం చెప్పాలి. సీమాంధ్ర నాయకత్వానికి గులాంగిరి చేస్తున్నవాళ్లకు, సీమాంధ్ర ఎస్టాబ్లిష్మెంటు కనుసైగలకు సలాములు కొడుతున్న వాళ్లను, అనేక విద్రోహాలు, వంచనల తర్వాత కూడా సీమాంధ్ర జెండాలను, ఎజెండాలను మోస్తున్నవాళ్లను ఓటుతోనే దెబ్బతీయాలి. తెలంగాణ సొంత రాజకీయ అస్తిత్వాన్ని నమ్మినవాళ్లను, మనవాళ్లను గెలిపించుకుని, అధికారాన్ని మన చేతుల్లోకి తీసుకోవడం ఒక్కటే మనకు మిగిలిన ప్రత్యామ్నాయం. చట్టసభల్లో తెలంగాణ సాధనకు అవసరమైన అధికారాన్ని మన ఓటుద్వారానే సాధించుకోవాలి. తెలంగాణకు అండగానిలబడి, తెలంగాణకు ఓటేసే వారిని మాత్రమే ఇక నుంచి పార్లమెంటు, చట్టసభలకు పంపాలి. ఓటుతోనే తెలంగాణ సాధించుకోవాలి.
తెలంగాణకు అడ్డుపడినవాళ్లు ఏ ప్రమాణాలతో చూసినా శిక్షకు అర్హులు. వీళ్లు ప్రజాస్వామికవాదులు కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ప్రకటిస్తూ తీర్మానాలు చేసి, ఎన్నికల మ్యానిఫెస్టోల్లో పెట్టి, రాష్ట్రపతి ప్రసంగాల్లో ప్రస్తావించి, అఖిలపక్ష సమావేశాల్లో ఓకే చెప్పి, పార్లమెంటు, శాసనసభల్లో ఉపన్యాసాలు చేసి…తీరా ఏర్పాటు ప్రక్రియను ప్రకటించాక మాటమార్చినవాళ్లు ప్రజాస్వామికవాదులు ఎలా అవుతారు? ప్రజాస్వామిక హక్కుల గురించి మాట్లాడే నైతిక బలం వారికి ఎలా ఉంటుంది? వీళ్లు సూత్రబద్ధ విధానాలకు కట్టుబడిన వారు కాదు. ఎప్పటికప్పుడు విధానాలను మార్చడం వీరి స్వభావం. ఊసరవెల్లి వీరి ముందు వెలవెలపోతుంది. ఎన్నికలకు ముందు ఒక విధానం, ఎన్నికల తర్వాత మరో విధానాన్ని చెప్పడం వీరికి అలవాటుగా మారింది. తెలుగుదేశం, కాంగ్రెస్లు అవకాశవాదానికి ప్రతీకలు. వీళ్లు బాధ్యత కలిగిన నాయకులు కాదు. బాధ్యత కలిగిన నాయకుడెవరూ తొందరపడి నిర్ణయాలు చేయడు. ఒకసారి నిర్ణయాలు చేసిన తర్వాతవెనుకకు తగ్గడు. కష్టమైనా నష్టమైనా చేసిన నిర్ణయానికి కట్టుబడి పోరాడతాడు. బాధ్యత లేనివారే గాలివాటంగా వ్యవహరిస్తారు. బాధ్యతారాహిత్యం వీరి టాగ్లైన్.
వీళ్లకు ప్రజల విజ్ఞతపై చాలా చిన్నచూపు. ప్రజలకు ఏదీ ఎక్కువకాలం గుర్తుండదని, కొన్ని పత్రికలు, మరికొన్ని చానెళ్లు పెట్టుకుని ప్రచారపటాటోపాలతో, అబద్ధాలతో వారిని మాయ చేయవచ్చని, ప్రజల్లో గందరగోళం సృష్టించి ఏదో విధంగా తిరిగి బోల్తా కొట్టించవచ్చని వీరికి, ముఖ్యంగా చంద్రబాబుకు గట్టి నమ్మకం. ఆయన మ్యానిప్యులేషన్స్ను నమ్మినంతగా నిజాయితీని నమ్మడు. ప్రజలను నమ్మించడం, ఒప్పించడం కంటే మానేజ్ చేయడంపైనే ఆయన ధ్యాసంతా. ఇంతకాలం వీరి ఆటలు సాగాయి. కుట్రలు, కుతంత్రాలు విజయవంతమయ్యాయి. కానీ ఇప్పుడు తెలంగాణ జాగృతమైంది. లక్ష్యాన్ని, మార్గాన్ని గుర్తించగలిగిన చైతన్యం వచ్చింది. లక్ష్యం తెలంగాణ రాష్ట్ర సాధన. మార్గం మనందరికీ తెలిసిందీ-అత్యంత ప్రజస్వామికమైనదీ-ఎన్నికల్లో సరైన తీర్పును ఇవ్వడం. ఒకే వేటు, ఒకే ఓటు. విద్రోహ రాజకీయ పతాకాలు ఎగిరిపడాలి. అవకాశవాద జెండాలు, ఎజెండాలను పాతరవేయాలి. కాలం మనకో అవకాశం ఇచ్చింది. కాటేయవలసిన తరుణం వచ్చింది.