తెలంగాణ ప్రజలు మనవాళ్లెవరో, కానివాళ్లెవరో గుర్తించాల్సిన సమయం వచ్చింది. మాటిమాటికి మాటలు మార్చిందెవరో, నిక్కచ్చిగా నిలబడి కొట్లాడిందెవరో తేల్చాల్సిన తరుణం వచ్చింది. తెలంగాణకు శత్రువులెవరో, తెలంగాణ పుత్రులెవరో నిర్ణయించుకోవలసిన సందర్భం వచ్చింది. తెలుగుదేశం తెలంగాణ పార్టీకాదు. దాని ప్రాంతమూ, సామాజిక పునాది రెండూ తెలంగాణకు సంబంధించినవి కాదు. అది తెలంగాణ సమస్యను ఎజెండాలోకి తెచ్చిన పార్టీ కూడా కాదు. ‘వేరే కారణాల వల్ల తెలంగాణ’ అనవలసి వచ్చిందని ఆ పార్టీ అధినేతే చెప్పుకున్నారు. ఎన్నికల అవసరాల వల్ల తెలంగాణ అనవలసి వచ్చిందని చెప్పలేడు కాబట్టి అలా చెప్పాడు. ఆ పార్టీ ఎప్పటికీ మనసుతో తెలంగాణను కోరుకోదు. తెలంగాణ ఇవ్వాలని కొట్లాడదు. ఆ పార్టీ ఇప్పుడు క్షీణిస్తున్న పార్టీ. ఆ పార్టీ చేసిన తప్పిదాలు దానిని పతనం వైపు నడిపిస్తున్నాయి. ఇక మిగిలింది కాంగ్రెస్ పార్టీ, దానికి నాయకత్వం వహిస్తున్న ఒక ప్రధాన సామాజిక వర్గం. తెలంగాణ సమస్యను ఎజెండాలోకి తెచ్చింది, పదేపదే హామీలు ఇచ్చింది, ఇస్తున్నట్టు ప్రకటించింది, మాటతప్పింది, పదేపదే మాటమార్చింది, తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకున్నది, వెయ్యిమంది యువకుల బలిదానాలకు కారణమైంది, ఆంధ్రప్రదేశ్ను సంక్షోభంలోకి నెట్టింది, నాలుగుకోట్ల మంది ఆకాంక్షను దోశ, కేకు…లతో పోల్చి తెలంగాణ ప్రజలను అదేపనిగా అవమానించింది కాంగ్రెస్ పార్టీ, దానిని మోస్తున్న సామాజిక వర్గ నాయకత్వమే. కేంద్రంలో, రాష్ట్రంలో తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉండీ, అన్ని అవకాశాలూ ఉండీ మోసం చేసిన పార్టీ కాంగ్రెస్. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వదల్చుకుంటే టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్లు అడ్డం కాదు. మాటతప్పినందుకు, మాట మార్చినందుకు ఆ పార్టీలను కూడాతెలంగాణ ప్రజలు శిక్షించవలసిందే. కానీ మొదటి నిందితుడిని నిర్ణయించుకోవలసి వస్తే మాత్రం అది కాంగ్రెస్ పార్టీయే. దేశంలోని ప్రధాన పార్టీలను తోసిరాజని, పార్లమెంటులో ఓడిపోవడానికి, మైనారిటీలో పడిపోవడానికి సిద్ధపడి కూడా అనేక వివాదాస్పద బిల్లులను ఆమోదింపజేసుకున్న ఘనత కాంగ్రెస్ది, యూపీఏ ప్రభుత్వానిది. అందువల్ల తెలంగాణ రాకపోవడానికి, ఇవ్వకపోవడానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్దే.
ఆడిన మాటలు దప్పిన
గాడిద కొడుకంటు దిట్టగా విని యయ్యో!
వీడా నాకొక కొడుకని
గాడిద యేడ్చెంగదన్న ఘన సంపన్నా!
ఆడినమాట తప్పినవారిని నిందించడంకోసం ఒక శతకకారుని వ్యంగ్యం ఇది. కాంగ్రెస్ను గాడిదతో పోల్చడం కూడా అన్యాయమే. గాడిద చాకిరీ చేస్తుంది, మోసం చేయదు. తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ ఎంత మోసపూరితంగా వ్యవహరించింది? ఎన్ని వేషాలు, ఎన్ని మాటలు, ఎన్ని హామీలు, ఎన్ని చర్చలు, ఎంత సాగదీత? తెలంగాణ ప్రజలను ఎంతగా అవమానించింది? ఎంతగా క్షోభకు గురిచేసింది? కాంగ్రెస్ ఎక్కడ మొదలై ఎక్కడదాకా వచ్చింది? 1999లో వరుసగా రెండవసారి అధికారం కోల్పోయిన తర్వాత, వైఎస్ రాజశేఖర్రెడ్డి పీసీసీ అధ్యక్షునిగా ఉన్నకాలంలో 2000 సంవత్సరంలో 41 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ డిమాండుతో ఢిల్లీకి వెళ్లిన నాటి నుంచి తాజాగా ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ఢిల్లీ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యల వరకు ఎన్ని మాటలు, ఎన్ని హామీలు, ఎన్ని చర్చలు ఆవిరైపోయాయి! కానీ తెలంగాణ రాలేదు. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్…మూడు పార్టీలూ తెలంగాణను ఒక అవసరంగా వాడుకున్నాయే తప్ప, చిత్తశుద్ధితో దానిని సాధించే లక్ష్యంతో పనిచేయలేదు. ఎన్నికల్లో గెలిచే సోపానంగా పరిగణించాయే తప్ప ప్రజల ఆకాంక్షను తీర్చే ఉద్దేశంతో పనిచేయలేదు. అందుకే తెలంగాణ సమస్య పరిష్కారం కాలేదు. తెలంగాణకు సంబంధించిన 100 మంది ఎమ్మెల్యేలు, 15 ఎంపీలు వీధుల్లోకి వచ్చి పోరాటం చేసినా, అసెంబ్లీ, పార్లమెంటులను స్తంభింప జేసినా, ఈ సమస్య ఇంతదూరం వచ్చేది కాదు. కానీ ఈ వంద మంది, 15 మంది ఒక్క జట్టుగా లేకపోవడమే తెలంగాణకు శాపమైంది. వీరిలో అత్యధికులు సీమాంధ్ర నాయకత్వాల్లోని పార్టీల్లో ఉండడమే తెలంగాణకు పాపమైంది. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు సీమాంధ్ర నేతల నాదస్వరానికి డూడూ బసవన్నలుగా ఆడారు తప్ప ఎదిరించిపోరాడే తెగువను చూపలేదు. తమ ఫార్చూన్లను చూసుకున్నారు తప్ప, తెలంగాణ ఫార్చూన్ను చూడలేదు. తెలంగాణలో కాంగ్రెస్లో చక్రం తిప్పుతున్న ఒక ప్రధాన సామాజిక వర్గానికి చెందిన నాయకత్వం చేష్టలుడిగి, చేవచచ్చి, పదవులచుట్టూ, పదవులకోసం పొర్లు దండాలు పెడుతున్నది. తెలంగాణ సాధనకోసం తెగించి పోరాడే ఒక చారిత్రక అవకాశాన్ని వారు కోల్పోయారు. తెలంగాణకు ద్రోహం చేసిన ముద్ర వీళ్లను జీవితకాలం వెంటాడుతుందన్నది గతానుభవమే. మర్రి చెన్నారెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కాగలిగారు తప్ప తెలంగాణకు ద్రోహం చేసిన చరిత్రను మాత్రం కడిగేసుకోలేకపోయారు.
టీడీపీ ఎమ్మెల్యేల పరిస్థితి ఇందుకు కొంత భిన్నం. వీరు డూడూ బసవన్నలుగానే కాదు, సీమాంధ్ర నేతల వేట కుక్కలుగా కూడా పనిచేస్తున్నారు. సీమాంధ్రలో చంద్రబాబు వస్తున్నా మీకోసం యాత్ర జరిగినన్ని రోజులు తెలంగాణ మాట ఎత్తవద్దని ఆదేశిస్తే అందరూ నోరుమూసుకుని కూర్చున్నారు. యాత్ర అయిపోతూనే తెలంగాణ ఉద్యమ నేతలపైకి వారిని పెంపుడు కుక్కల్లా ఎగదోశారు. ఒక అబద్ధాన్ని వందసార్లు ప్రచారం చేసి నిజం చేయాలన్న గోబెల్ సిద్ధాంతాన్ని చంద్రబాబు ఇప్పటికీ బలంగా నమ్ముతున్నారు. ఆయన నిజాయితీనీ, కష్టాన్నీ కాకుండా కుట్రలను, కుతంత్రాలను నమ్ముతున్నారు. ఆయన ప్రజలను కాకుండా, ప్రచారాన్ని నమ్ముతున్నారు. ప్రజలను తన విధానాలతో మార్చడానికి ప్రయత్నించకుండా, ‘ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అప్పటికా మాటలాడి’ ఏమార్చడానికి ప్రయత్నిస్తున్నారు. రాజకీయాల్లో నిజాయితీలేని కష్టం వృధా అవుతుంది. ఈ పార్టీలలోని తెలంగాణ నేతలు మనుషులే ఇక్కడ. రిమోట్ సీమాంధ్ర నేతల చేతుల్లోనే. వీళ్ల జెండా, ఎజెండారెండూ తెలంగాణ కాదు. ఈ పార్టీలకు తెలంగాణలో పునాదులు ఉన్నంతకాలం తెలంగాణ ఒక బలమైన రాజకీయ శక్తిగా నిలబడి కొట్లాడలేదు. ‘తెలంగాణలో ఒక్క టీఆరెస్సే ఉండాలా?’ అని ఒక విశ్లేషకుడు ప్రశ్నించాడు. తెలంగాణలో వెయ్యి పార్టీలు ఉండనీ. బలపడనీ. అవి తెలంగాణ పార్టీలే అయి ఉండాలి. వాటి నాయకత్వం తెలంగాణ నాయకుల చేతుల్లోనే ఉండాలి. మన ఓట్లతో గెలిచి, మంది పాటపాడేవాళ్లను మాత్రం తెలంగాణ ప్రజలు సహించకూడదన్నదే తెలంగాణవాదుల ఆకాంక్ష. తెలంగాణ చేత, తెలంగాణ కొరకు పనిచేసే తెలంగాణ పార్టీలు కావాలన్నదే వారి ఆశ, ఆశయం. తెలంగాణలో బిజెపి, సిపిఐ, న్యూడెమాక్రసీలు ఉన్నాయి. ఆ పార్టీలూ బలపడుతున్నాయి. కొత్తగా శక్తులను కూడదీసుకుంటున్నాయి. సరికొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాయి. నాగం జనార్దనరెడ్డి బిజెపికి కొత్త బలం. ఆ పార్టీలనెవరూ ప్రశ్నించడం లేదు. నాయకత్వాలు ఎక్కడివాళ్లయినా తెలంగాణకోసమే మాట్లాడుతున్నారు. సిపిఐ కార్యదర్శి నారాయణ మాదిరిగా కరీంనగర్లో, తిరుపతిలో ఒకే నినాదం ఇవ్వగల దమ్ము ఏ పార్టీ నాయకులకు ఉంది?
‘ఎన్నికలకు నాలుగు మాసాల ముందు తెలంగాణపై ఏదో ఒక తీర్మానం చేస్తుంది. మళ్లీ ఓట్లు వేయించుకునేందుకు ప్రయత్నిస్తుంది.. అప్పుడు మీరేం చేస్తారు?’ అని అమెరికా భారతీయ మిత్రుడొకరు ప్రశ్నించారు. ఒక అంశంపై ఒకసారి మోసం చేయవచ్చు. పదేపదే మోసం చేయడం, పదమూడేళ్లుగా మోసం చేయడం సాధ్యం కాదు. ఇప్పుడు తెలంగాణ ఆ దశలన్నింటినీ దాటిపోయింది. కేవలం తీర్మానాలు, ఇస్తామన్న హామీలు తెలంగాణ ప్రజలను శాంతింప జేయలేవు. ఒక వేళ ఎన్నికలకు నాలుగు మాసాల ముందు కేంద్ర మంత్రివర్గం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తీర్మానం చేసినా దానికి ఏ విలువా ఉండదు. పార్లమెంటులో విభజన తీర్మానం ఆమోదం పొందడం తప్ప మరేదీ తెలంగాణ ప్రజలకు సమ్మతం కాదు, ఉత్త పార్టీ తీర్మానాలు, మంత్రివర్గ తీర్మానాలు మరోసారి మోసం చేయడానికి ఉపయోగపడతాయి తప్ప తెలంగాణ ఏర్పాటుకు దోహదపడవు. పదేళ్లూ అధికారం అనుభవించి, పార్లమెంటులో విభజన తీర్మానం పెట్టడానికి అన్ని అవకాశాలు ఉండి, అదేదీ చేయకుండా, మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేని ఆఖరు క్షణాల్లో కంటి తుడుపు తీర్మానాలు చేస్తే ఎవరు నమ్ముతారు? ‘కాంగ్రెస్ ఎందుకిలా చేస్తున్నది?’ అని ఆయనే మరో ప్రశ్న వేశారు. గతులు తప్పినప్పుడు ప్రాప్తకాలజ్ఞత నశిస్తుంది. తెలంగాణపై ఇప్పుడు నిర్ణయం చేసి, పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో విభజన ప్రక్రియ పూర్తి చేసినా కాంగ్రెస్కు కనీసం తెలంగాణ మిగులుతుంది. ఇది తప్ప కాంగ్రెస్ను రక్షించగల మరో ప్రత్యామ్నాయం ఏదీ లేదు. బహుశా ఆంధ్రప్రదేశ్ను ఇక వదిలేసుకోక తప్పదని కాంగ్రెస్ ఒక అంచనాకు వచ్చి ఉంటుంది. మరో ఐదేళ్ల తర్వాత చూసుకుందామని భావిస్తూ ఉండవచ్చు. కానీ ఐదేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇలా కొనసాగే అవకాశమే లేదు. కర్ణాటక మాదిరిగా ఇక్కడ తిరిగి కాంగ్రెస్ను ఆదరించే అవకాశం లేదు. తమిళనాడు తరహా రాజకీయ పరిస్థితులు ఇక్కడ అవతరించే అవకాశాలే ఎక్కువ. ప్రాంతీయ పార్టీలు ఇంకా బలపడి తమిళనాడు తరహాలో కాంగ్రెస్ శాశ్వతంగా జూనియర్ భాగస్వామిగా మారిపోవడానికి అవకాశాలు న్నాయి. ఎన్నికల తర్వాత టీఆరెస్ లేక వైఎస్సార్ కాంగ్రెస్లకు ఏ పార్టీతోనూ విలీనం కావలసిన అవసరం అయితే ఉత్పన్నం కాదు. అవి శాశ్వత రాజకీయ పక్షాలుగా నిలిచిపోతాయి. ఎన్డీఏ అయినా యూపీఏ అయినా ఎన్నికల తర్వాత మద్దతును కోరగలవు తప్ప షరతులు విధించే శక్తిని కలిగి ఉండవు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు తమ రాజకీయ భవిష్యత్తుకోసమయినా తెగించాల్సిన సమయం ఇది. తెగించినవాళ్లను తెలంగాణ సమాజం అక్కున జేర్చుకుంటోంది. మిగిలిన కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు తెలంగాణవాదులుగా నిరూపించుకుంటారో, శాశ్వతంగా ద్రోహులుగా మిగిలిపోతారో తేల్చుకోవాలి. ముందు చూపును ప్రదర్శించని నాయకులెవరూ చరిత్రలో మిగల్లేదు.